e-తెలుగు చూపిన “తెలుగు బాట”

తెలుగు భాషా దినోత్సవం- సుమారు పదిహేను సంవత్సరాల క్రితం బడిలో జరుపుకున్న పండగ. ఈ తెలుగు వారు తెలుగు బాట కార్యక్రమం చేద్దామని అన్న నిమిషం నుండీ దీన్ని ఎలా విజయవంతం చేయాలా! అన్న ఆలోచన మొదలైంది. మా అమ్మ నేర్పిన అప్పయ్య దీక్షుతుల వారి పద్యం “ఆంధ్రత్వం ఆంధ్ర భాషా చ ఆల్పస్య తపః ఫలం” దాని అర్ధం మనసులో ఒక్క సారి జ్ఞప్తికి వచ్చాయి. జీతం కోసం పరభాషను ఆశ్రయించిన నేను మళ్ళీ జీవితం కోసం అమ్మ భాషలో బ్లాగటం మొదలుపెట్టినా ఇంకా ఏదో చేయాలన్న తపన. సరే- ఈ తెలుగు సంస్థలో సభ్యుడినైన నాకు ఆ కోరికను తీర్చుకునే అవకాశం రానే వచ్చింది.

నేను బ్లాగటం మొదలెట్టినప్పటి నుండీ తెలుగు భాషపై గౌరవం ప్రేమ రోజురోజుకూ ఎక్కువవసాగాయి. అక్షయమైన యాభై రెండు తెలుగు అక్షరాలంటే ఎందుకో తెలియదు కానీ అవ్యాజమైన ప్రేమ. పాశ్చాత్య నాగరికతను ఆఫీసుకు పరిమితం చేయక నట్టింటికి తెచ్చుకున్నాను ఇన్నాళ్ళూ- మళ్ళీ నా నాగరికత, నా భాష కోసం వెనక్కి వెళ్తుంటే నా బాల్యంలోకి వెళ్తున్నంత ఆనందం కలిగింది.

ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ఎందరో ప్రముఖులను కలిసే అవకాశం నాకు, సోదరి సుజాత గారికి మరియు కొందరు తెలుగు మిత్రులకూ కలిగింది. మీడియా భాగస్వామ్యం కోసం హెచ్.ఎమ్.టీ.వీ అధినేత రామచంద్ర మూర్తి గారిని కలిస్తే, సంస్థ చేస్తున్న కృషిని మనఃస్పూర్తిగా అభినందించి స్క్రోలింగ్, ప్రోమోలు మరియు కవరేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పెద్దాయన కార్యక్రమంలో పాల్గొంటానని మాట కూడా ఇచ్చారు. తెలుగు బాటలో పాల్గొనే వారికి ఉచితంగా సీడీలను అందించడానికి కంప్యూటర్ విజ్ఞానం తేజ గారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారి సంస్థ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల సంచికలో ఈ తెలుగు కోసం కొన్ని పేజీలను కేటాయించి వారివంతు సహకారం అందించారు. సహృదయం స్పందిస్తే సత్కార్యం సాధ్యమే అని అందరూ నిరూపించుకున్నారు.

రాము గారు, చక్రపాణి గారు, నందం నరేష్ చేసిన సహాయం మరచిపోలేనిది. మేము అడిగిందే ఆలస్యం అన్ని ఏర్పాట్లనూ దగ్గరుండి చేసిపెట్టారు. కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో సూచనలు చేసి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించారు. తనికెళ్ళ భరణి గారి బైట్ కోసం పది నిమిషాల సమయం ఇచ్చినా కార్యక్రమ లక్ష్యం అర్ధం చేసుకుని మరెందరో ప్రముఖులకు ఫోన్లు చేసి మూడుగంటల పాటు అందరితో మాట్లాడి సంస్థనూ, కార్యక్రమాన్నీ పరిచయం చేసి వారి సహాయాన్ని కోరారు. అందులో కొందరు- గాయని శైలజ గారు, పాటల రచయితలు భువనచంద్ర, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి(తెలుగు బాట కార్యక్రమానికి పాట రాసి ఇచ్చారు), నటులు అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, బాల ఆదిత్య, దర్శకులు వి.ఎన్ ఆదిత్య, గాయకులు రఘు కుంచే, నిహాల్, రాజకీయ నాయకులు బండారు దత్తాత్రేయ మరియు చంద్రబాబు నాయుడు- కార్యక్రమ విషయం చెప్తే చాలా సంతోషించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తూ బైట్స్ ఇచ్చారు. ఇంకా చాలా మందిని కలిసే అవకాశం ఉన్నా సమయాభావం వల్ల కలవలేకపోయాము.

అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం ఆరున్నరకు తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరాం. తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి మెడలో వాడిపోయిన  పూల దండ చూసేప్పటికి కట్టా విజయ్ గారికి మనసూరుకున్నట్టు లేదు. వెంటనే పైకి ఎక్కి దానిని తొలగించే ఏర్పాట్లలో పడ్డారు. నేనూ నావంతుగా పీఠం పైకి ఎక్కాను. తెలుగు తల్లికీ చామంతుల దండ వేసిన ఆ క్షణం ఓ గొప్ప అనుభూతి.

తెల్లవారుఝామున 8కి, పైగా ఆదివారం, ఆపై తెలుగు తల్లి విగ్రహం వద్ద కార్యక్రమం— అయినా పట్టించుకోకుండా వచ్చిన అశేష జనావళిని చూసి ముచ్చటేసింది. ఎనభై లక్షల జనాభా ఉన్న హైదరాబాదులో తెలుగు భాష కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలు పత్రికలలో, మీడియాలో, ఆన్ లైన్లో ప్రకటనలు వచ్చినా, కార్యక్రమంలో పాల్గొనడానికి సభ్యత్వ రుసుము లేదనీ ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ… అని చెప్పినా పట్టుమని వంద మంది కూడా రాకపోతే కాస్త బాధేసింది- “గంగి గోవు పాలు గరిటడైనను చాలు” అన్నట్లు వచ్చిన వారు తక్కువైనా అందరూ వారి భాషాభిమానాన్ని చాటుకున్నారు. రానివాళ్ళ సంగతా! సరే కానివ్వండి- ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కనీసం రాబోయే కార్యక్రమాలకైనా వస్తారేమో చూద్దాం!

అందరితో కలిసి బానర్లు కట్టడం, “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” పాడటం, తాడేపల్లి వారు రాసిన “తెలుగు భాష ప్రతిజ్ఞ” చేయడం ఆనందాన్ని కలిగించాయి.   ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న సమయానికి వచ్చిన రామ చంద్ర మూర్తి గారు, పూణే నుండి వచ్చిన తాత గారు- “ఫణి బాబు” గారు, రాజకీయాల కన్నా తెలుగుపై ఎక్కువ మమకారం ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు, భూమిక సత్యవతి గారు, ఇంగ్లీష్& తెలుగు సుజాత గార్లూ, అమెరికా నుండీ అప్పుడే దిగుమతైన చక్రవర్తీ, ఎప్పటిలాగానే చదువు ఎగ్గొట్టి మరీ వచ్చిన కౌటిల్య, అసలు రాడు అనుకున్న అశ్విన్ బూదరాజు మరియు అనేక మంది తెలుగు మిత్రులను కలవటం సంతోషంగా అనిపించింది.

ప్రాచీనతనూ సాధించాం-ఆధునికతనూ సాధిస్తాం“, “జీతం కోసం పరభాష- జీవితం కోసం మన భాష“, “పొరుగు భాషను గౌరవించూ- ఇంటి భాషను కౌగిలించూ” అనే నినాదాలు తెలుగు బాట పూర్తయ్యే వరకూ సాగాయి. పేరు తెలియదు కానీ ఓ బ్లాగ్ మిత్రుడు తెలుగు బాట పూర్తయ్యేవరకూ నినాదాలు చేస్తూ అందరినీ చైతన్యపరిచాడు. స్వాతి గారు దారి పొడవునా ఆగుతూ అందరికీ మంచి నీటిని అందించారు.

ఆశ్చర్యంగా ఫణి బాబు గారు, బుద్ధప్రసాద్ గారు ఆఖరి వరకు నడవటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది- ఎంతైనా వారూ “యూత్” కదా! తెలుగులోనే మాట్లాడతాం అని ఒకరికొకరు కంకణాలు కట్టుకుని జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించాం.

తెలుగును కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతీ గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ఎంతో శ్రమించిన ప్రతి ఈ తెలుగు కార్యకర్తలకూ, సహాయపడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను పరిరక్షించుకునే బాధ్యత అందరూ తీసుకోవాలి.

Posted in తెలుగు వెలుగు, Uncategorized | 2 Comments

మయూరి సుధ

చంద్రబింబం లాంటి మోము ఆమెది… సుధారసాన్ని కురిపించే మాటలు ఆమెవి… కాలికి గజ్జ కట్టి ఆమె శాస్త్రీయ నృత్యం చేయటం మొదలుపెడితే మయూరాన్ని తలపించి ,ఆపై మరిపించగల నాట్య విన్యాసం ఆమెది. ఆమె కెంపులు, అరవంకలు- వడ్డాణపు నడుమొంపులు మనలను ముగ్ధులను చేస్తాయి.. కాటుక కన్నులు, పూలజడల అరమరికతలు మనసును పరవశింపజేసి నాట్యం చేయిస్తాయి… ఆమె నడకలో వయ్యారాలు, చూపుల్లో సితారలు చిలిపిగా పలకరిస్తాయి… కుడి ఎడమల క్రీగంటి చూపులు, జతులు, గతులు, ముద్రలు ముగ్ధమనోహరంగా పలకరిస్తాయి… జీవితంలో ఎదుర్కొన్న ఓ ప్రమాదం తనను మానసికంగా కృంగదీసి ప్రాణసమానమైన నాట్యానికి దూరం చేసినా మొక్క
వోని పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో విజయం సాధించిన ఓ అసాధారణ మహిళ “సుధా చంద్రన్“.
మొన్న శనివారం ఆ వారాంతం ఎలా గడుపుదామా అని ఆలోచిస్తున్న సమయంలో సోదరుడు శ్రీనివాస్ కుమార్ ఫోన్ చేసి ’మయూరి సుధ’ గారి నాట్య ప్రదర్శన రవీంద్ర భారతిలో ఉంది- వస్తావా? అని అడిగారు-ఎప్పుడో 10వ తరగతిలో ఆమె గురించి పాఠంగా చదువుకున్న నాకు ఆమె ప్రదర్శనను తిలకించే అదృష్టం, నాకు పునర్జన్మను ప్రసాదించిన ఆమెను కళ్ళారా చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి “సరే” అని చెప్పా… కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి శ్రీనివాస్ కుమార్ గారి కుటుంబం, అశ్విన్ బూదరాజు, నేను రవీద్ర
భారతికి చేరుకున్నాం.
సుమారు పాతిక సంవత్సరాల తర్వాత హైదరాబాదులో ఆమె నాట్య ప్రదర్శన. నటరాజ స్వామికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోయారు.
మొదటి అంకం- ’సీతా స్వయంవరం- సీతగా సిగ్గును కురిపించింది.. రావణునిగా దర్పాన్ని ప్రదర్శించింది.. రామచంద్రుని సౌకుమార్యాన్ని, వినయాన్ని అభినయించింది… శివధనుర్భంగం నుండీ రావణ సంహారం దాకా అంతా తానే… ప్రేక్షకుల హర్షధ్వానాలు…..
రెండో అంకం- ’ ఆది శంకర విరచిత భజగోవిందం- భజగోవిందం నృత్యరూపకంగా చూడటం నాకు ఇదే ప్రధమం. ఆ శ్లోకాలలోని పరమార్ధాన్ని ఆమె ప్రదర్శించిన తీరు వర్ణనాతీతం… సంస్కృత భాష తెలియని వారికి కూడా ఆమె హావభావాలతో భజగోవింద శ్లోకాల అంతరార్ధం అవగతమైందంటే అతిశయం కాదేమో!!!
మూడో అంకం- “దశావతారాలు- ‘మత్స్య,కూర్మ, వరాహశ్చ, నారశింహశ్చ, వామనః- రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కి రేవచః’ అని చిన్నప్పుడు చదివిన శ్లోకం, ఆ అవతారాలు కళ్ళముందు మెదిలాయ్.
ఒక్కొక్క అవతారం నుండీ మరో అవతారానికి గల పరిణామక్రమాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన తీరు అనిర్వచనీయం. ముఖ్యంగా వామనావతారం, నృశింహావతారం, రామావతారం,కృష్ణావతారం(కురుక్షేత్ర ఘట్టం).. అంకం పరిసమాప్తమయ్యేసరికి ఆనందంతో చెమరిన కళ్ళు, మ్రోగిన చప్పట్లు అనేకం.
కూచిపూడి నృత్యం ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ శోభానాయుడు గారి చేతుల మీదుగా “నాట్య కళా నిధి” పురస్కారాన్ని సుధా చంద్రన్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న మరో విశేషం పుంభావ సరస్వతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి గారిని మేము కలవగలగటం. అక్కినేని మొదలు నావరకు ఎందరో ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు కృత్రిమ కాలిని చూడటానికి ప్రయత్నించి విఫలులమయ్యాం… కారణం సమ్మోహనం.
కార్యక్రమానంతరం మయూరి సుధ గారిని కలిసి ఓ నాలుగు నిమిషాలు మాట్లాడగలిగే అవకాశం కలిగింది. ఆమె కాళ్ళకు నమస్కరించి క్లుప్తంగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మూడున్నర నెలల క్రితం ఓ ప్రమాదంలో నా కాలు విరిగింది… దాదాపు రెండు నెలల పాటు నేను మంచంపైనే విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి… అప్పుడే మొదలుపెట్టిన వ్యాపారం నేను లేని కారణంగా అనేక సమస్యలను సృష్టించటం, మనసు ఆందోళన చెందటం వల్ల నిస్పృహ నన్ను ఆవహించింది. ఆ సమయంలో ఓ రోజు టీవీలో మీ ’మయూరి’ సినిమా చూశాను. అది నాలో ఉత్తేజాన్ని నింపి స్థైర్యాన్ని పెంచింది. ఇప్పుడు నేను అన్ని అవరోధాలనూ అధిగమించాను- అందుకు పరోక్షంగా మీరు కారణం.. మీకు నా కృతజ్ఞతలు— దానికి ఆవిడ ఇచ్చిన సమాధానం పరిస్థితులకు తలవంచితే మనం ఓడిపోయినట్టే- గెలుపు ఇచ్చే ఆనందం కోసం అప్పట్లో నేను నొప్పిని భరించి సాధన చేశాను. పట్టుదలతో కృషి చేసేవారికి విజయం తధ్యం. ఇన్ని వందల మంది మీరు నాట్యం బాగా చేస్తారు అని చెప్పే మాటలకన్నా మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. విజయోస్తు
ఆమెకు వీడ్కోలు చెప్పి మధురానుభూతులను వెంటతెచ్చుకున్నాను- రేపటికి నా అనుభూతి జ్ఞాపకంగా మారినా పరిమళాలను వెదజల్లుతూ మనసులో సజీవంగా మిగిలిపోతుంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే ఈ అసాధారణ నాట్య మయూరి మరెందరో జీవితాలను ప్రభావితం చేయాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ…
ఎందరో మహానుభావులు… అందరికీ వందనములు…
Posted in జ్ఞాపకాలు | 11 Comments

సాక్షి

మత్తెక్కించే మల్లెల సాక్షి…

గుసగుసలెన్నో చెప్పే గులాబీల సాక్షి…

సన్నని తన నడుములాంటి సన్నజాజి పూల సాక్షి…

ముద్దుగుమ్మకి ఇష్టమైన ముద్దమందారం సాక్షి…

కవిత్వాన్ని పలికించే కనకాంబరాల సాక్షి…

భావుకతను పెంచేటి బంతిపూల సాక్షి…

చెలియ చిలిపి చూపులాంటి చామంతుల సాక్షి…

ప్రతిపువ్వును తలపించే తన చిరునవ్వుల సాక్షి…


—- నేను తనను ప్రేమిస్తున్నాను……


కలువలాగ విచ్చుకునే కాంత కళ్ళ సాక్షి…

వజ్రంతో పొదగబడిన వగలాడి ముక్కుపుడక సాక్షి…

అమౄతాన్ని చిలికించే అతివ అధరాల సాక్షి…

ఊసులకే సాక్ష్యమైన ఊగే లోలకుల సాక్షి…

నా గుండెలో సవ్వడి చేసే తన కాలి మువ్వల సాక్షి…

మందాకినిని మరిపించే ఆమె హొయల నడక సాక్షి…

తెలుగుదనం ఉట్టిపడే నా చెలి చీరకట్టు సాక్షి…


—- నేను తనను ప్రేమిస్తున్నాను……


ప్రపంచాన్ని మరిపించిన మా పరిచయ క్షణాల సాక్షి…

ఆమె మొదటి స్పర్శలోని పులకరింత సాక్షి,

తొలి ముద్దులోని తెలియని తుంటరితనం సాక్షి…

మా ఏడడుగులనూ దోచుకెళ్ళిన సముద్రపు అలల సాక్షి…

ఆమె కోసం నిరీక్షించిన యుగాల సాక్షి…

తన సమక్షంలో నేననుభవించిన ప్రతి నిమిషం సాక్షి…

చెలి వదిలిన ఒంటరితనపు పరివేదన సాక్షి…


నాదైన తన సాక్షి…

తనవాడనైన నా సాక్షి…

ఒక్కటైన మా మనసుల సాక్షి…


నేను తనను ప్రేమిస్తున్నాను… ఆమె కోసమే జీవిస్తున్నాను…
Posted in కవితలు | 7 Comments

స్నేహ సమ్మేళనం


స్నేహ సమ్మేళనం- ఈ టైటిల్ తో ఒక ఆహ్వాన పత్రిక నేను చదువుకున్న బడి నుండి వచ్చింది. ఒక్క సారి గతంలోకి వెళ్ళిపోయాను. 

సరస్వతీ విద్యా మందిర్- నాకు విద్య నేర్పిన బడి, విలువల గుడి. 1972లో స్థాపించబడి కొన్ని వేల మంది విద్యార్ధులకు ఉత్తమ సంస్కారాలతో కూడిన విద్యను బోధిస్తూ వారి ప్రగతికి కృషి చేస్తున్న సంస్థ. సంస్కారం, నైతిక విలువలు, గుణవికాసములతో కూడిన విద్యను శిశు ప్రాయం నుండి అందించడంతో మా పాఠశాల విద్యార్ధులు నేడు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, న్యాయవాదులుగా, వ్యాపారస్తులుగా, సాంకేతిక నిపుణులుగా మరియు అనేక రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్నారు.

మేము చదువుకున్న రోజుల్లో సందడి వేరుగా వుండేది. ఉదయం ప్రార్ధన సమయానికి పిల్లలందరం కలిసి సరస్వతీ దేవి పటానికి ఇళ్ళనుండీ తీసుకెళ్ళిన పువ్వులతో అలంకరించేవాళ్ళం. “హే హంసవాహినీ.. జ్ఞానదాయినీ… ” అంటూ ప్రార్ధన చేసి తరగతులకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం అన్నపూర్ణాష్టకం చదివి భోజనాలు చేసేవాళ్ళం. శారీరక, ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని మాకు సంపూర్ణంగా  కలిగించారు. 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందన్న పెద్దల మాటకి మా సరస్వతీ విద్యామందిరమే ఆధారమని నా అభిప్రాయం. సదాచారం అని ఓ సబ్జెక్ట్ వుండేది- నైతిక విలువలు, దేశభక్తి, దైవభక్తిని పాఠ్యాంశాలుగా ప్రత్యేకించి బోధించిన విధానం మరువలేనిది. మా ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర కృషి, మాపై చూపిన ప్రేమ, ఆప్యాయత ఎంత చెప్పినా తక్కువే. గురు పౌర్ణమి, రక్షాబంధన్ వచ్చాయంటే మా ఆనందానికి అవధులు వుండేవి కావు- స్నేహితులమంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించేవాళ్ళం. చిననాటి స్నేహితులు, కల్మషంలేని స్నేహం, మేం చేసిన అల్లరి గుర్తుకుతెచ్చుకుంటే మనసు ఆనందంతో వయసును మరిచిపోయింది. ఆలోచనల దొంతరలలో నుండీ బయటకి వచ్చి ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూశాను.

ఆదివారం ఉదయం గిడసబారిన పెద్దరికాన్ని బయటే వదిలేసి ఆ దేవాలయంలో అడుగుపెట్టాను. 15 ఏళ్ళలో నా జీవితంలో ఎన్నో మారాయి కానీ మా బడి మారలేదు- కానీ కాస్త కళ తగ్గింది. ప్రస్తుత విద్యార్ధులు మా బడిని చాలా అందంగా  ముస్తాబు చేశారు. అక్కడ పండగ వాతావరణం కనిపించింది. ఓ పక్క స్వాగత తోరణాలు, మరో పక్క పందిరి, ఇంకో పక్క వేదికపై అందంగా అలంకరించిన సరస్వతీ దేవి. అక్కడే సంవత్సరాల వారిగా మా గ్రూప్ ఫోటోలు. నన్ను నేను పోల్చుకోడానికి కాస్త సమయం పట్టింది.

ఇంతలో వెనకాతల నుండి ఎక్కడో పరిచయం వున్న గొంతు- తిరిగి చూస్తే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ జగన్మోహన్ గారు. నమస్కరించి పరిచయం చేసుకుంటే గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. లంగా ఓణీల్లో చూసిన మా రెండు జళ్ళ సీతలు చీరల్లోకి మారి వారి చిన్నారులతో కలిసి వచ్చారు. గర్భవతి అయినా ఈ కార్యక్రమం కోసం బెంగుళూరు నుండి వచ్చిన నా స్నేహితురాలు శ్రీమతి తులసిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఎన్నో ఏళ్ళ తరువాత కలిసినా అదే చనువు- కొన్ని మారకపోతేనే అందంగా వుంటాయేమో!  ఎవరెవరు ఏం చదువుకున్నామో, ప్రస్తుతం ఏం చేస్తున్నామో కబుర్లు చెప్పుకున్నాం. మేం చదువుకున్న తరగతి గదుల్లో మేం కూర్చున్న బల్లలని తాకినప్పుడు మనసు ఏదో తెలియని అనుభూతికి లోనైంది- బహుశా అందరి పరిస్థితీ అదేనేమో!

ప్రార్ధనా గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలుగు భాషలో విద్యా బోధన ఆవశ్యకత, పాఠశాల నూతన భవన నిర్మాణం, ఆధునీకరణ ప్రధానాంశాలుగా పెద్దల ఉపన్యాసాలు సాగాయి. ఆశ్చర్యం కలిగించేలా పూర్వ విద్యార్ధులు పెద్ద మొత్తంలో  విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అప్పుడే అనిపించింది- సహృదయం స్పందిస్తే సత్కార్యం సాధ్యమని. కార్యక్రమం సాగుతుండగా విచ్చేసిన మా సైన్స్ టీచర్ శ్రీమతి ఎస్.పార్వతి గారిని చూసిన మా ఆనందానికి అవధులు లేవు. అదే అప్యాయత, అదే హుందాతనం. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించారు. భోజనాల సమయంలో కూడా విద్యార్ధులందరినీ  తిన్నారో లేదో కనుక్కుంటుంటే అమ్మతనం కనిపించింది- అవును మేము ఆవిడ పిల్లలమేగా!

ఎవరివంతు సహాయం వారు చేస్తామని మాట ఇచ్చి, చిరునామాలు తీసుకుని తిరిగి వస్తుంటే నా హృదయం మధురానుభూతులతో నిండింది. కార్యక్రమానికి రాలేకపోయిన మా తెలుగు టీచర్ శ్రీమతి సాయిజ లక్ష్మి గారి ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేశా. అదే గొంతు. పేరు చెప్పగానే గుర్తు పట్టేశారు- ఆవిడని చూడాలన్న కోరికతో వెంటనే బయలుదేరి వారి ఇంటికి వెళ్ళాను. మనిషిలో మార్పే లేదు- అదే గాంభీర్యం- అంత ఎనర్జీ ఆవిడకే సొంతం. ఆ గొంతు వింటే ఒకప్పుడు కాస్త భయపడ్డవాడిని- ఇవ్వాళ ఆవిడతో మాట్లాడుతుంటే ఎదో ఆనందం. మళ్ళీ పాతరోజులు గుర్తుచేసుకున్నాం. నాకు భాషా సంస్కారాన్ని నేర్పిన నా గురువు ఆవిడ. నా మీద ఆవిడ ప్రభావం చాలా వుంది. సనాతన భారతి బ్లాగ్ ని చూపిస్తే చాలా సంతోషించారు(తప్పులు కనపడితే బెత్తం ఎత్తుతారేమో అన్న భయం మాత్రం నాలో వుంది). కాళ్లకి నమస్కారం చేస్తే ఆవిడ మనఃస్పూర్తిగా ఆశీర్వదించారు- ఆ ఆశీర్బలం పుణ్యమేనేమో ఈ స్థాయికి చేరుకోగలిగాం. 


 నా నేటి జీవితానికి బంగరుబాట వేయటంతో పాటు సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మానవత్వం, సభ్యత, సంస్కారాలను నేర్పిన మా బడి ఇంకా అనేకమందిని ఇదే పద్ధతిలో తీర్చిదిద్దాలని ఆశిస్తూ…. మా గురువులకు భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ….
Posted in Uncategorized | 8 Comments

శతమానం భవతి!

(ఫిబ్రవరి 18 మా అక్క-బావగారి పెళ్ళి రోజు. ఇది పదవది. నాకు తెలిసి అన్యోన్య దాంపత్యానికి చిరునామా వారిరువురే. నా మరో తల్లి తండ్రులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ………)


పాల నవ్వులు- తేనె ఝల్లులూ,
ముద్దు మురిపాలు- మధుర స్మృతులు..
మీ అన్యోన్య జీవన రాగానికి పల్లవీ చరణాలై,
వెల్లువెత్తి ఉప్పొంగే సుమధుర భావ తరంగాల విహంగాలై….

కలిమి లేములు, కోపతాపాలు, జయాపజయాలు
ముచ్చటైన మీ దాంపత్యం ముందు తలలు వంచి
మీ కనుసన్నలలో నడయాడగా,
ప్రేమైక స్వరూపాలై వర్ధిల్లాలని,
ప్రకృతి ఒడిలో నిత్య వసంతాలై విలసిల్లాలని….

కలకాలం మెరుపుతీవలై ప్రకాశించాలని,
ఆశిస్తూఆకాంక్షిస్తూ,
వివాహ మహోత్సవ సంరంభాల
సౌరభాలను ఆహ్వానిస్తూ….

మీ మాట, బాట పూదోటగా, నవ్వుల పంటగా,
నిండు నూరేళ్ళు ఎదురులేని జంటాగా
వర్థిల్లాలని గుడిగంటల సాక్షిగా
గుండె గంటలు మ్రోగించి,
నా శిరసు వంచి ప్రేమతో మీ ఇరువురికీ
పదవ పెళ్ళి పండుగ శుభాకాంక్షలందిస్తూ……………..

మీ…..
సతీష్

Posted in Uncategorized | 4 Comments

ఐ-న్యూస్ లో ఈ-తెలుగు కార్యక్రమం — నివేదిక


నిన్న ( 25-జనవరి) ఈ-తెలుగు మరో ముందడుగు వేసింది. కొత్తగా రాబోతున్న వార్తా ఛానల్ ఐ-న్యూస్ వారు ఈ-తెలుగు పై, వాటి కార్యకలాపాలపై ఒక కార్యక్రమాన్ని జరపదలచి మనలను సంప్రదించడం జరిగింది. ఈ మధ్య అనేక వార్తా పత్రికలలో ఈ-తెలుగు కార్యకలాపాలపై వ్యాసాలు వచ్చినా, ఐ-న్యూస్ ద్వారా అనేక మందికి ఈ-తెలుగు కార్యక్రమాలను పరిచయం చేయగలిగే అవకాశం రావటం శుభసూచకం.

సమయం చాలా తక్కువగా వుండటం వలనా, కార్యక్రమం ఇంటిలో చేయడంతో స్థలాభావం వలన కేవలం అందుబాటులో వున్న బ్లాగరులను అప్పటికప్పుడు హడావిడిగా పిలవడం జరిగింది.

అనుకున్న సమయానికి కాస్త అటూ ఇటూ గా సభ్యులందరూ మధ్యాహ్నం చదువరి గారి ఇంటికి చేరుకున్నాం. ఐ-న్యూస్ వారితో పరిచయాలు అయిన తరువాత షూటింగ్ మేకప్ లేకుండానే మొదలయింది.

ఈ-తెలుగు అధ్యక్షులు శిరీష్ గారు ఈ-తెలుగు ఎప్పుడు ఎలా స్థాపించారో, దాని ఆశయాలు ఏమిటో, ఇప్పటివరకు చేసిన మరియు రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు.

సాంకేతిక సహాయం అడిగిన వెంటనే అందించే మన శ్రీధర్ గారు కంప్యూటర్‍లో తెలుగును ఎలా స్థాపించాలో, ఎలా రాయాలో వివరంగా చెప్పారు.

శ్రీనివాస్ రాజు దాట్ల తెలుగు వికీపీడియా గురించి, అందులో ఎన్ని వ్యాసాలు వున్నాయో, ఎంతమంది సభ్యులు వున్నారో, తెలుగు వికీలో ఎలా రాయాలో చెప్పడం జరిగింది.

లేఖినిని తెలుగు బ్లాగరులకు వరంగా అందించి, ఎంతమంది తనను పొగుడుతున్నా నేలమీదే నిలబడి తన పని తాను చేసుకుని వెళ్ళిపొయే నిగర్వి వీవెన్ గారు బ్లాగుల సంకలిని అయిన కూడలి గురించి, బ్లాగుల గురించి వివరించారు.

షూటింగ్‍కి కాస్సేపు కట్ చెప్పి వరూధిని గారు పెట్టిన బాదుషాలను, సమొసాలను ఓ పట్టు పట్టి మళ్ళీ మొదలుపెట్టాం.

నేను (సతీష్ యనమండ్ర) వెబ్ పత్రికలయిన ఈ-మాట, పొద్దు, ప్రజాకళ, భూమిక, నవతరంగం గురించి వాటి సామాజిక, సాహిత్య విలువల గురించి వివరించాను.

అందరినీ ఆత్మీయంగా పలకరించే నా సోదరుడు శ్రీనివాస్ గారు (జీవితంలో కొత్తకోణం) బ్లాగులలోని టపాలకు వచ్చే స్పందనలు ప్రచార మాధ్యమాలకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో, యూనికోడ్ వల్ల ఉపయొగాలను తెలియజేసారు.

వెంకట రమణ గారు ఈ-తెలుగు కార్యక్రమాలకు అయ్యే ఖర్చు సభ్యులే భరిస్తున్నారని, సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు.

టపాల ద్వారా తన అంతరంగాన్ని, అనుభవాలను అద్భుతమైన మాటల్లో ఆవిష్కరించే నా మరో సోదరుడు మురళి (మురళీగానం) స్థానికీకరణ గురించి, అందుబాటులో వున్న సాఫ్ట్ వేర్‍ని తెనుగీకరించడం గురించి చెప్పి షూటింగ్ కార్యక్రమాన్ని ముగించారు.

ఐ-న్యూస్ వారు వెళ్ళిన తరువాత మన ప్రచార సామగ్రిని మెరుగుపరచే అంశం మీద చాలాసేపు చర్చించాము. మరో ఆనందం కలిగించే విషయం- ఈ చర్చ జరుగుతున్న సమయంలో తెలుగు భాషాభిమాని కార్తీక్ గారు ఫోన్ చేసి తెలుగు బ్లాగులను చూసినప్పుడు తన స్పందననీ, ఆనందాన్నీ తెలియజేశారు. బ్లాగరులను కలవాలన్న వారి ఆరాటం మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారు కూడా త్వరలో ఒక తెలుగు బ్లాగ్ మొదలుపెడతారని నమ్మకం కలిగింది.

కాలాతీతం అవుతున్నా శాంతంగా తన సంపూర్ణ సహకారాన్ని అందించిన శాంతి గారికి, ఐ-న్యూస్ సిబ్బందికి మా ధన్యవాదములు. షూటింగ్ నిమిత్తం ఇంటిని మేమందరం చిందర వందర చేసినా నవ్వుతూ సహకరించిన వరూధిని గారికి, వారి పిల్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమానంతో మన కార్యక్రమానికి వచ్చి సహాయపడిన మురళి గారి మిత్రుడు తారక్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా తెలుగులో బ్లాగ్ మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను.

Note: మన కార్యక్రమం మరో మూడు రోజుల్లో ప్రసారం కావచ్చని తెలిసింది. వీలయితే ప్రసార సమయాన్ని తెలియపరుస్తాను. వీడియోల నుండి ఫోటోలను సంగ్రహించినా క్లారిటీ లేని కారణంగా పొందుపరచటం లేదు. వీడియోని మాత్రం రికార్డ్ చేసి అందుబాటులో వుంచుతాను.

Posted in Uncategorized | 10 Comments

గరిమెళ్ళ వారితో నేను

సంక్రాంతి పండుగకు విజయవాడ వెళ్ళినప్పుడు ఘంటసాల సంగీత కళాశాలలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగితే వెళ్ళాను. వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమాలలో ఎందరో మహానుభావుల కచేరీలు వినే అదృష్టం కలిగింది. త్యాగరాజ కీర్తనలు శ్రవణానందాన్ని కలిగించడమే కాక మనసులో భక్తి భావాన్ని నింపాయి.

చిన్నప్పటి నుండీ కలుసుకోవాలనుకున్న గాన గంధర్వుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కచేరీ ప్రత్యక్షంగా వినే/చూసే భాగ్యం కలిగింది. ఆ రాగసుధా గానం విని నన్ను నేను మరిచిపొయాను. కచేరీ పూర్తవగానే వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకుని రెండు నిమిషాలు మాట్లాడగలిగాను. ఆ సరస్వతీ పుత్రుడు ఎంతో ఆత్మీయంగా, వినయంగా అందరితో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను. వారితో కలిసి తీయించుకున్న ఫొటో….

స్వరాలతో శ్రీనివాసుడిని అర్చిస్తున్న ఈ సరస్వతీ పుత్రుడికి నా పాదాభివందనాలు. వీరిపై త్వరలో ఒక వ్యాసం రాస్తాను.

ఎందరో మహానుభావులు…… అందరికీ వందనములు!!!!!!

Posted in ప్రముఖులతో నేను, విద్వాంసులు | 3 Comments